భారత్‌లో కరోనా మహమ్మారి కాదు.. సాధారణ వ్యాధి : సౌమ్యా స్వామినాథన్

బుధవారం, 25 ఆగస్టు 2021 (13:24 IST)
కరోనా వైరస్ మహమ్మారి ఒక్క భారత్‌నేకాదు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ మరణాలు లక్షల్లో ఉన్నాయి. గత 2019లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికీ అంతమైపోలేదు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కరోనా ఓ మామూలు జబ్బులా (ఎండెమిక్) మారిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ చెప్పుకొచ్చారు. 
 
త్వరలోనే కొవాగ్జిన్ పనితీరుపై డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ గ్రూప్ సంతృప్తి వ్యక్తం చేస్తుందని, వచ్చే నెల మధ్య నాటికి వ్యాక్సిన్‌కు అనుమతులను ఇచ్చే అవకాశముందని ఆమె చెప్పారు. దేశ ప్రజల భిన్న సంస్కృతుల ప్రజలు, వారి రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకుంటే.. దేశంలో మున్ముందు కరోనా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందన్నారు.
 
ఇప్పటికే కొన్ని చోట్ల మహమ్మారి ఎండెమిక్‌గా మారిన సందర్భాలున్నాయన్నారు. కొన్ని నెలల క్రితం కేసులు భారీగా నమోదయ్యాయని, కానీ, ఇప్పుడు హెచ్చతగ్గులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కరోనా బారినపడిన‌వారు, వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోని వారిపై రాబోయే రోజుల్లో ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరముంటుందని చెప్పారు. 
 
అదేసమయంలో థర్డ్ వేవ్‌పై తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇటీవలి సీరో సర్వేలు, విదేశాల్లోని పరిస్థితులను చూస్తే అర్థమవుతోందన్నారు. పిల్లల్లో కరోనా మరణాల రేటు చాలా తక్కువన్నారు. అయినా కూడా పిల్లలకు మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు