దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిన కరోనా కేసులు!

గురువారం, 18 మార్చి 2021 (10:10 IST)
భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10.63లక్షల పరీక్షలు చేయగా.. 35,871 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,63,025కు చేరి.. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది.
 
మరోవైపు కరోనా మరణాలు మంగళవారంతో పోలిస్తే గత రోజు కొంతమేర తగ్గాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 188 మరణాలు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 172మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,216కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  2,52,364 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 20లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,71,43,255కి చేరింది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 59,905 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1662కి చేరింది. 
 
కరోనా బారి నుంచి నిన్న 111 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,120కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,265 ఉండగా.. వీరిలో 830 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 94,19,677కి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు