థర్డ్ వేవ్ ఇబ్బందికరమే.. నవంబర్‌లో మళ్లీ ముప్పు తప్పదా?

శుక్రవారం, 28 మే 2021 (19:11 IST)
సెకండ్ వేవ్ దేశంలో జూన్ చివరి నాటికి అదుపులోకి వచ్చినా.. నవంబర్‌లో థర్డ్ వేవ్ కారణంగా మాత్రం మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కంట్రోల్ చేయాలంటే వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తికి ఇమ్యూనిటీ మూడు నుంచి 6 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత అదే వ్యక్తి మరోసారి వైరస్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి సుమారుగా 5 నుంచి 6 నెలల తర్వాత మరో ముప్పు ఉండే అవకాశం ఉంది. అప్పటికి ప్రజల్లో రోగనిరోధకత తగ్గే ఆస్కారం ఉంటుందని, అందుకే మళ్లీ నవంబర్ నెలలో కేసులు ఆందోళనకర స్థాయికి చేరే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
 
వైరస్ విజృంభిస్తున్న సమయంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం వల్లే దేశంలో సెకండ్ వేవ్ ఉధృతికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి కేసుల్లో పెరుగుదల కనిపించినప్పటికి ప్రజారోగ్య వ్యవస్థ సరిగా స్పందించడంలో విఫలం అయ్యిందని ప్రొ.మూర్తి తెలిపారు. 
 
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రకారం దక్షిణాదితో పాటు పశ్చిమ రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి జూన్ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేశారు. 
 
ఇక తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య జూలై మధ్యకాలం వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే దేశంలో 30ఏళ్లు పైబడిన వారిలో 80శాతం మందికి వ్యాక్సిన్ అందించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు