లాక్‌డౌన్ ఫలితం : కరోనా పెరుగుదల నిష్పత్తి తగ్గుదల?

శుక్రవారం, 27 మార్చి 2020 (07:50 IST)
ప్రపంచాన్ని చుట్టేసి భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశంలోని 130 కోట్ల మంది తమ నివాసాలకే పరిమితమయ్యారు. అయినప్పటికీ దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 694 మంది కరోనాతో బాధపడుతున్నారు. గురువారం ఒక్కరోజే 90 కేసులు నమోదైనట్టు పేర్కొంది. 
 
అయితే, దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పందించారు. ఈ లాక్‌డౌన్ ఫలాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వల్ల రోగుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తి మాత్రం తగ్గుతోందని చెప్పుకొచ్చారు. 
 
అయినప్పటికీ ఈ విషయంలో ఉదాసీనత అస్సలు పనికిరాదన్నారు. దేశంలో కొందరు రోగులకు ఆ వైరస్ ఎక్కడి నుంచి సోకిందో తెలియడం లేదని, అంతమాత్రాన దానిని సామాజిక వ్యాప్తిగా ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయకుంటే మాత్రం సామాజిక వ్యాప్తి తప్పదని హెచ్చరించారు. 
 
గృహాలకే పరిమితమైన పెద్దవాళ్ళతో మాట్లాడేటపుడు కూడా కనీసం మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రమణ్ ఆర్. గంగాఖేడ్కర్ సూచించారు. అపుడే వారు సురక్షితంగా ఉండగలుగుతారని చెప్పారు. లేనిపక్షంలో చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు