మహారాష్ట్రలో కరోనా సునామీ... డబుల్ మ్యుటేషనే కారణమా?

గురువారం, 15 ఏప్రియల్ 2021 (10:25 IST)
మహారాష్ట్రలో కరోనా సునామీ కొనసాగుతోంది. దీనికి కారణం డబుల్ మ్యూటేషన్‌గా భావిస్తున్నారు. తాజాగా ఈ మహమ్మారి బారినపడుతున్న వారి నమూనాలను పరీక్షించగా, 61 శాతం మందిలో డబుల్ మ్యుటేషన్ బయటపడినట్టు వైరాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
దేశంలో వైరస్ విజృంభణను అంచనా వేసేందుకు పాజిటివ్ రోగుల నమూనాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వరంలో ఎప్పటికప్పుడు జినోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. ఇందులోభాగంగా మహారాష్ట్రలో జనవరి, మార్చి నెలల మధ్య 361 కరోనా నమూనాలను విశ్లేషించారు. 
 
వీటిలో 61 శాతం శాంపిళ్లలో డబుల్ మ్యుటేషన్లు బయటపడ్డాయి. అయితే, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి డబుల్ మ్యుటేషనే కారణమని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. 
 
జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన నమూనాల ఫలితాలను ల్యాబొరేటరీలు వెల్లడించడం లేదని, కాబట్టి వైరస్ మ్యుటేషన్లను తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వైరస్ రకం ఎంత ప్రమాదకరమైనదో తెలిస్తే ప్రజలను అంతగా అప్రమత్తం చేసే వీలుంటుందని అంటున్నారు.
 
ఇదిలావుంటే, ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని కుంభమేళాలో రెండు రోజుల్లో 1000 మంది భక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం 408 మంది కరోనా బారిన పడగా.. మంగళవారం 594 మందికి కొవిడ్‌ సోకింది. కుంభమేళాకు రోజూ లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. కానీ కొంత మందికే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భక్తుల్లో కొంత మంది కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. 
 
కాగా కుంభమేళా సూపర్‌ స్ర్పెడర్‌ ఈవెంట్‌ కాదని, సోమవారం మేళాను సందర్శించిన వారిలో 53 వేల మందికి అధికారులు టెస్టులు నిర్వహించారని, వాటిలో పాజిటివ్‌ రేటు 1.5 శాతం మాత్రమేనని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. 90 శాతం మంది భక్తులు హరిద్వార్‌లో ఉండరని, కాబట్టి వారి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం లేదన్నారు. రోజూ కొన్ని లక్షల మంది భక్తులు వచ్చే కుంభమేళా వంటి భారీ కార్యక్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడడం సాధ్యం కాదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు