దడపుట్టిస్తున్న వైరస్ - కరోనా వ్యాప్తి రెట్టింపు : కొత్తగా 3390 కేసులు

శుక్రవారం, 8 మే 2020 (09:48 IST)
దేశ ప్రజలు కరోనా వైరస్ దెబ్బకు హడలిపోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి దూకుడు చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండెల్లో దడపుడుతోంది. అంతేకాకుండా, గత నాలుగైదు రోజులుగా కరోనా రెట్టించిన వేగంతో విజృంభిస్తోంది. ఫలితంగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత గత 24 గంటల్లో మరో 3390 కేసులు నమోదయ్యాయి. 
 
ముఖ్యంగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతోంది. ఇదే సమయంలో రికవరీ రేటు పెరిగిందని, మరణాల రేటు 2.2 శాతానికి తగ్గినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ వారం ప్రారంభంలో కేసుల రెట్టింపు సమయం 12 రోజులుగా ఉండగా, గత మూడు రోజుల్లో పెరిగిన కేసులతో ఈ సమయం దిగి వచ్చింది. మరోవైపు కొత్త కేసుల విషయంలో పాత రికార్డులు బద్ధలవుతున్నాయి. నిత్యమూ అత్యధిక కేసులు వస్తున్నాయి. దీంతో కేసులు రెట్టింపు కావడానికి అయ్యే సమయం తగ్గుతూ వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
అయితే, ఒక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి కరోనా సమాచారం స్పష్టంగా అందడం లేదనీ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఆరోపించారు. అయితే, ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు. దేశంలోని కరోనా బాధితుల్లో 1.1 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, వెంటిలేటర్లపై 3.3 శాతం మంది, ఐసీయూలో 4.8 శాతం మంది ఉన్నారని ఆయన వెల్లడించారు.
 
మరోవైపు, గత 24 గంటల్లో కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56342కు చేరాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 16,539 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. 
 
ఆసుపత్రుల్లో 37,916  మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మాత్రం రికార్డు స్థాయిలో 17,974 కేసులు నమోదు కాగా, గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1717 కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు