చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలు, భారత్ వైపు చూపు

గురువారం, 7 మే 2020 (17:58 IST)
చైనా కారణంగా ప్రాణ నష్టం చవిచూసిన అనేక దేశాలు దానితో పొత్తును విరమించుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా మరియు చైనా మధ్య ఇదివరకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. ట్రంప్ చైనా పేరెత్తితేనే తీవ్ర స్థాయిలో ఎగసి పడుతుండటం తెలిసిందే. చైనాలోని విదేశీ సంస్థలు, పరిశ్రమలను ఆయా దేశాలు స్వదేశానికి రప్పించుకోవడానికి వ్యూహాలు చేస్తున్నాయి. 
 
జపాన్ ఇప్పటికే దీనికోసం 2.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఐరోపా దేశాలు కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పుడు చైనాలోని అమెరికా సంస్థలను భారత్‌కు రప్పించాలని మోదీ ప్రయత్నం చేస్తున్నారు. చైనా నుండి బయటకు వచ్చేసే ఉద్దేశంతో ఉన్న వెయ్యికి పైగా అమెరికా ఉత్పత్తి సంస్థలను భారత్ సంప్రదించింది. 
 
ఇన్సెంటివ్‌లను కూడా ఆఫర్ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటో పార్ట్ తయారీ సంస్థలకు భారత్ ప్రాధాన్యం ఇస్తోందని సమాచారం. హెల్త్‌కేర్ ఉత్పత్తులు, పరికరాల సంస్థలు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని మోదీ సర్కారు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే మెడ్‌ట్రోనిక్, అబోట్ ల్యాబోరేటరీస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను భారత్‌కు తరలించడం గురించి చర్చలు జరుపుతున్నాయి. 
 
ఈ సంస్థలు ఇప్పటికే భారత్‌ నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తుండటంతో ఉత్పత్తి యూనిట్‌లను చైనా నుండి భారత్‌కు తరలించడం కష్టం కాదని భావిస్తున్నారు. చైనా, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ ధరకే భూమి లభిస్తుందని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఇక్కడ అధికమని అధికారులు సంస్థలకు చెబుతున్నారు. 
 
అవసరమైతే కార్మిక చట్టాలను కూడా సవరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కంపెనీలకు తెలిపారు. ఇప్పటికే చాలా సంస్థలు వియత్నాం వైపు మొగ్గు చూపాయి కానీ వియత్నాం, కాంబోడియా లాంటి దేశాలతో పోలిస్తే భారత్ మార్కెట్ పెద్దదనే విషయాన్ని కూడా నిపుణులు ప్రస్తావించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు