బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి కరోనా పాజిటివ్.. కొత్తగా? పాతదా?

బుధవారం, 23 డిశెంబరు 2020 (08:29 IST)
ఇపుడు ప్రపంచాన్ని మరో వైరస్ చుట్టుముట్టేలా వుంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో అల్లాడిపోతుంటే.. తాజాగా అది కొత్తరూపం సంతరించుకుంది. దానికి కరోనా స్ట్రెయిన్ అని పేరు పెట్టారు. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు హడలిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా స్ట్రెయిన్ వ్యాపించకుండా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇది కరోనా వైరస్ కంటే అధికంగా వ్యాపిస్తుందని, పైగా చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరించింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఇదిలావుంటే, తాజాగా బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ అయింది. విమానాశ్రయంలో చేస్తున్న ఆర్టీ‌పీసీఆర్ పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
మంగళవారం 16 మందికి నిర్ధారణ కాగా, 11, 13 తేదీల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు పరీక్షల్లో తేలింది. వీరిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారికి సోకినది కరోనా వైరస్ కొత్త స్ట్రెయినా? లేక, పాతదా? అన్నది తేలాల్సి ఉంది.
 
బ్రిటన్ నుంచి వచ్చేవారు కొత్త కరోనా వైరస్ బారినపడినట్టయితే, వారిని టిమ్స్‌లో చేర్చి, వారితో కాంట్రాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు మాత్రం అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
కాగా, గత నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా వివిధ దేశాల నుంచి తెలంగాణకు మూడువేల మందికిపైగా వచ్చినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది. దీంతో వీరిలో ముందుగా వచ్చిన 1500 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు