భారత్‌లో కరోనా స్ట్రెయిన్ కలకలం : ఢిల్లీ - చెన్నైల్లో కొత్త కేసులు

మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:26 IST)
బ్రిటన్‌లో శరవేగంగా విజృంభిస్తున్న కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఇపుడు భారత్‌లోనూ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్‌ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్.. ఇపుడు భారత్‌లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, చెన్నైలలో ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
సోమవారం రాత్రి లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
అలాగే, మంగళవారం ఉదయం బ్రిటీష్ ఎయిర్ వేస్‌కు చెందిన మరో విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో వచ్చిన ప్రయాణికులందరి శాంపిల్స్‌ని సేకరించారు. వీరి శాంపిల్స్‌ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫర్ రీసర్చ్‌కి పంపించారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసొలేషన్‌కు పంపుతున్నారు.
 
అలాగే, బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ ప్రయాణికుడుకి కూడా ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. దీంతో అతన్ని క్వారంటైన్‌కు తరలించినట్టు తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విజయభాస్కరన్ తెలిపారు. 
 
కాగా, ఈ కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ దెబ్బకు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తున్న విషయం తెల్సిందే. కరోనా ఇంకా ఉద్ధృతంగా ఉన్న తరుణంలోనే కొత్త స్ట్రెయిన్ రావడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. 
 
ఇప్పటికే ఈ కొత్త వైరస్ పలు ఇతర దేశాలకు పాకినట్టు తెలుస్తోంది. పలు దేశాలు బ్రిటన్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఇండియా కూడా ట్రావెల్ బ్యాన్ విధించినప్పటికీ... రేపటి నుంచి నిషేధం అమల్లోకి రాబోతోంది. 
 
దీంతో బ్రిటన్‌లో ఉన్న అనేక మంది భారతీయులు ఒక్కసారిగా భారత్‌కు భారీ సంఖ్యలో తిరిగివస్తున్నారు. వీరందరికీ విధిగా పరీక్షలు నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు