తెలంగాణలో కరోనా కోరలు.. లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ ఛాన్స్ లేదు: ఈటెల

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న (ఏప్రిల్ 15,2021) రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 3వేల 840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించే ఆస్కారం లేదని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలే కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈటెల చెప్పారు. అలాగే 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరామన్నారు.

అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సెకండ్ వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలని మంత్రి సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు