స్పృహతప్పి పడిపోయిన షర్మిల.. తేరుకున్నాక అరెస్ట్ చేసిన పోలీసులు

గురువారం, 15 ఏప్రియల్ 2021 (22:43 IST)
sharmila
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్పృహతప్పి పడిపోయారు. తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆమె నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టారు. అనంతరం ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. 
 
పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అటు ఆమెకు మద్దతిచ్చేందుకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఆమె స్పృహతప్పి పడిపోయారు. షర్మిల తేరుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
తెలంగాణ ప్రజల కోసం షర్మిల నిలబడిందని విజయలక్ష్మీ తెలిపారు. షర్మిల పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. 
 
షర్మిల దీక్షను గౌరవిస్తే ప్రభుత్వానికి గౌరవంగా ఉండేదన్నారు. పోలీసులు హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మీ తెలిపారు.
 
అంతకుముందు ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం కలగడం లేదని ఆమె ప్రశ్నించారు. అయితే నిజానికి తాను ముందుగా ప్రకటించినట్టుగా 72 గంటల పాటు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. 
 
తన 72 గంటల దీక్ష పూర్తయిన తర్వాత నిరుద్యోగులకు మద్దతుగా జిల్లాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు దీక్షలు చేస్తారని ఆమె తెలిపారు. షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు