వ్యాక్సిన్‌కు భారత్‌ను అనుమతి కోరిన ఫైజర్!

ఆదివారం, 6 డిశెంబరు 2020 (13:00 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ ఓ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సిద్ధంగా ఉంది. ఇందుకు అనుమతి ఇవ్వాలని ఫైజర్ కోరింది. ఈ మేరకు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి ద‌ర‌ఖాస్తు చేస్తుంది. కాగా, భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి కోరిన తొలి సంస్థ ఫైజర్ కావడం గమనార్హం. 
 
ఇప్ప‌టికే ఈ సంస్థ వ్యాక్సిన్‌కు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, బహ్రెయిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. అతి త్వ‌ర‌లోనే బ్రిట‌న్‌లో ఈ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేనున్నారు. భారత్‌కు త‌మ వ్యాక్సిన్‌ను దిగుమ‌తి చేసి ఇక్క‌డ విక్ర‌యించ‌డానికి, పంపిణీ చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ఈ నెల 4న ఫైజ‌ర్ డీసీజీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకుంది. 
 
అంతేకాదు కొత్త డ్రగ్స్‌, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. త‌మ వ్యాక్సిన్‌ను ఇండియాలోని ప్ర‌జ‌ల‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా చూడాల‌ని కూడా కోరింది. అయితే భారత్‌లో ఒక వ్యాక్సిన్‌ను అనుమ‌తించాలంటే.. ఇక్క‌డ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సి ఉంటుంది. 
 
కానీ ఫైజ‌ర్ మాత్రం ఇలాంటి ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తామ‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ కోర‌లేదు. అయితే డీసీజీఐకి స్థానికంగా క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌ను మిన‌హాయించే విచ‌క్ష‌ణాధికారం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కైతే ఇలాంటి విచ‌క్ష‌ణాధికారాన్ని డీసీజీఐ ఎప్పుడూ ఉప‌యోగించ‌లేదు. యూకేలో అనుమ‌తి సాధించిన త‌ర్వాత భారత్‌లోనూ త‌మ వ్యాక్సిన్ వినియోగం కోసం ఫైజ‌ర్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. 
 
అయితే ఈ ఫైజ‌ర్ వ్యాక్సిన్‌ను మైన‌స్ 70 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ద‌గ్గ‌ర స్టోర్ చేయాల్సి ఉండ‌టంతో.. అందుకు త‌గిన వ‌స‌తులు భారత్‌లో లేవ‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణంగా భారత్‌లో వ్సాక్సిన్‌ల‌ను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో స్టోర్ చేసి ఉంచుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు