ఆ మూడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే టీకా బాగా పని చేస్తున్నట్టా?

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (14:24 IST)
ప్రపంచాన్ని భయకంపితులను చేసిన కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా పలు ఫార్మా కంపెనీలు టీకాలను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ టీకాల పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్నాయి. మన దేశంలో కూడా ఈ టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ టీకాలు తీసుకున్న వారిలో అత్యధికులు బాగానే ఉన్నా, అతి కొద్దిమందికి మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్‌లు వస్తున్నాయి.
 
మరికొందరు టీకా తీసుకున్న తర్వాత చనిపోయారని వార్తలు వచ్చినా, వారి మరణానికి, టీకాకు సంబంధం లేదని వైద్య ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ సీడీసీ చీఫ్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ కీలక ప్రకటన చేశారు.
 
టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్‌లు వస్తేనే టీకా సమర్ధవంతంగా పనిచేసినట్టుగా భావించవచ్చన్నారు. ఏవైనా ప్రభావాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్‌లూ ప్రాణాంతకమేమీ కాదని, అది వ్యాక్సిన్ శరీరంలో పని చేస్తోందనడానికి సంకేతమని స్పష్టం చేశారు. 
 
ఏ వ్యాధికి టీకాను తీసుకున్నా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్‌లు సర్వసాధారణమని చెప్పిన ఆయన, ఇవి ఎటువంటివైనా రెండు నుంచి మూడు రోజుల్లోనే సమసిపోతాయని వెల్లడించారు. కరోనా టీకాను తీసుకున్న తర్వాత శరీరంలో ఉండే సాధారణ రోగ నిరోధక శక్తి స్పందిస్తుందని, దీని ప్రభావంతో శరీరానికి నొప్పులు, స్వల్పంగా జ్వరం, జలుబు వంటివి రావచ్చని ఆయన అన్నారు. 
 
ముఖ్యంగా కండరాల నొప్పులు, తలనొప్పి రావడం, నీరసంగా అనిపించడం సంభవిస్తే, వ్యాక్సిన్ ప్రభావం శరీరంపై చూపిస్తున్నట్టుగానే భావించాలని, ఇవేవీ ఇబ్బంది పెట్టేంతగా ఉండబోవని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు