భారత్‌లో నాలుగో కరోనా వేవ్ ప్రభావం ఎంత?

సోమవారం, 21 మార్చి 2022 (14:03 IST)
భారత్‌ కరోనా రెండు వేవ్‌లను చవిచూసింది. ఇక రాబోయే రెండు నెలల్లో ఎప్పుడైనా నాలుగో కోవిడ్ వేవ్ భారత్‌ను తాకే అవకాశం వున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా దేశాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 
 
చైనా, కొన్ని ఇతర దేశాలు గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులలో గణనీయమైన పెరుగుదలను చూశాయి, దీని వల్ల త్వరలో మరొక వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఈ నాలుగో వేవ్ ప్రభావం దేశంపై ఎలా వుంటుందంటే.. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జూన్ నెలలో నాల్గవ కరోనా వేవ్ భారతదేశాన్ని తాకే అవకాశం ఉంది. 
 
థర్డ్ వేవ్ ఎఫెక్ట్ భారత్‌పై పెద్దగా లేదు. భారతదేశంలో మూడో వేవ్ తీవ్రత రేటు తక్కువగా నమోదైంది. అందువల్ల రాబోయే నాలుగో కరోనా వేవ్‌ ప్రభావం తక్కువగా వుండవచ్చునని అంచనా మాత్రమే. కానీ ఏదిఏమైనా నాలుగో కోవిడ్ వేవ్‌కు భారత్ సిద్ధంగా ఉండాలని, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
 
గత రెండు సంవత్సరాల నుండి చైనా కరోనాతో నానా తంటాలు పడిన సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల ద్వారా రోగనిరోధక శక్తి కారణంగా భారతదేశంలో కోవిడ్ స్ట్రెయిన్ తక్కువ ప్రమాదకరంగా ఉండవచ్చు. 
 
వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా భారతదేశం ఇప్పటికే మరొక కోవిడ్ దెబ్బకు సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ తెలిపారు. చాలా మంది ప్రజలు కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోస్‌లను పూర్తి చేశారని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు