5కే రన్స్ క్లబ్‌లో అరోన్ ఫించ్ - నిలకడగా ఆసీస్ బ్యాటింగ్

శుక్రవారం, 27 నవంబరు 2020 (11:22 IST)
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆర‌న్ ఫించ్ త‌న ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌ను వేసుకున్నాడు. వ‌న్డేల్లో అయిదు వేల ప‌రుగులు సాధించిన ఆసీస్ క్రికెట‌ర్‌గా నిలిచాడు. శుక్రవారం సిడ్నీ వేదికగా భార‌త్‌తో ప్రారంభ‌మైన తొలి వ‌న్డేలో ఫించ్ ఆ రికార్డును సాధించాడు. ఫించ్‌కు ఇది 130వ వ‌న్డే. అత‌ని కెరీర్ స‌గ‌టు 40.98గా ఉంది. వ‌న్డేల్లో ఫించ్ మొత్తం 16 సెంచ‌రీలు చేశాడు. వ‌న్డేల్లో 5వేల ప‌రుగుల మైలురాయిని దాటిన ఆసీస్ క్రికెట‌ర్లు చాలా మంది ఉన్నారు.
 
ఆ ప్లేయ‌ర్ల జాబితాలో పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, మార్క్ వా, క్లార్క్‌, స్టీవ్ వా, బేవన్‌, బోర్డ‌ర్‌, హైడెన్‌, జోన్స్‌, బూన్‌, వాట్సాన్‌, హ‌స్సీ, మార్టిన్‌, వార్న‌ర్‌, సైమండ్స్ ఉన్నారు. ఫించ్ కేవ‌లం 126వ ఇన్నింగ్స్‌లో 5వేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. వార్న‌ర్ ఈ ఘ‌న‌త‌ను కేవ‌లం 115 మ్యాచుల్లోనే అందుకున్నాడు. వ‌న్డేల్లో 5 వేల మార్క్‌ను దాటిన రెండ‌వ ఫాస్టెస్ట్ ఆసీస్ ప్లేయ‌ర్‌గా ఫించ్ నిల‌వ‌డం విశేషం. 
 
తొలి వన్డే : నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా...
సిడ్నీ వేదికగా పర్యాటక భారత్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఆసీస్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు ప్రారంభించారు. ఇండియా బౌలింగ్‌ను మహమ్మద్ షమీ, బుమ్రా ప్రారంభించారు. వార్నర్, ఫించ్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ.. లూజ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు.
 
ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 51 పరుగులు చేసింది. వార్నర్ 20 పరుగులతో, ఫించ్ 29 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఫించ్ 4, వార్నర్ 2 బౌండరీలను బాదారు. 10 ఓవర్లతో ఆస్ట్రేలియా రన్ రేట్ 5.1గా ఉంది. మరోవైపు ఫించ్ తన వన్డే కెరీర్లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
 
కాగా, ఈ సిరీస్‌కు అభిమానుల‌ను కూడా స్టేడియాల్లోకి అనుమ‌తిస్తున్నారు. సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డేకు 50 శాతం మాత్ర‌మే నిండేలా ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించారు. 9 నెల‌ల త‌ర్వాత టీమిండియా ఆడ‌నున్న తొలి అంత‌ర్జాతీయ సిరీస్ కావ‌డంతో అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. 
 
గత ప‌ర్య‌ట‌న‌లో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చ‌రిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌కు లేక‌పోవ‌డం కాస్త లోటుగా క‌నిపిస్తోంది. 
 
మోవైపు, రోహిత్ శ‌ర్మ లేక‌పోవ‌డంతో శిఖ‌ర్ ధావ‌న్‌తో క‌లిసి మ‌యాంక్ అగ‌ర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మూడోస్థానంలో కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్‌కు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. 
 
ఈ సిరీస్‌లోనూ రాహులే వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. ఇక బుమ్రా, ష‌మి ఇద్ద‌రూ తుది జ‌ట్టులో ఉంటే.. ఠాకూర్‌, సైనీల‌లో ఒక‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. అటు స్పిన్న‌ర్ల‌లో చాహ‌ల్ లేదా కుల్‌దీప్‌ల‌లో ఒక‌రిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది.
 
ఇండియా జట్టు: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహాల్
 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మార్నస్, స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజల్ వుడ్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు