ఆసియా కప్‌కు కరోనా దెబ్బ.. శ్రీలంక ఆటగాళ్లకు కరోనా పాజిటివ్

శనివారం, 26 ఆగస్టు 2023 (17:09 IST)
ఆసియా కప్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీపై కరోనా ప్రభావం పడుతుందన్న భయం నెలకొంది. ఈ ఏడాది ఆసియా కప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంకకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు సమాచారం. ఈసారి ఆసియా కప్‌కు పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 
 
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ఈ ఆసియాకప్‌ను హైబ్రిడ్‌ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు మాత్రమే జరగనుండగా, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌తో సహా 9 ముఖ్యమైన మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇంతలో, ఆతిథ్య లంక జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో టోర్నీకి ఎదురుదెబ్బ తగిలింది.
 
శ్రీలంక రిపోర్టర్ దనుష్క అరవింద ప్రకారం, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిద్దరికీ వైరస్ సోకిందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, వైరస్ కారణంగా పెరీరా, ఫెర్నాండో ఇద్దరూ ఆసియా కప్ నుండి నిష్క్రమిస్తే అది జట్టుకు గట్టి దెబ్బేనని చెప్పవచ్చు. ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు