నటి హాజెల్కీచ్తో వివాహం ముగిసిన తర్వాత చండీగఢ్లో సిక్కు సంప్రదాయంలో, గోవాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో యువరాజ్, కీచ్లు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళి వేడుకలో యువీ ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. గోవాలో వివాహ తంతు ముగిశాక తన భార్య కీచ్ గురించి చెప్పేందుకు యూవీ స్టేజెక్కాడు. ఈ సందర్భంగా తన తల్లి షబ్నమ్ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు.
తండ్రి కుటుంబం నుంచి దూరంగా జరిగాక కుటుంబాన్ని పోషించేందుకు తల్లి ఎన్నో ఇబ్బందులు పడిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిందంటూ కంటతడి పెట్టుకున్నాడు. తర్వాత తేరుకుని మళ్లీ మాట్లాడుతూ తనకు కేన్సర్ ఉందని తెలిసిన క్షణం కుంగిపోయానని పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తల్లి తనకు అండగా నిలిచిందని, ఎంతో ధైర్యాన్ని నూరిపోసిందని చెప్పుకొచ్చాడు.