పాక్ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు.. వారి ప్రతిభ ప్రతిధ్వనిస్తోంది : విరాట్ కోహ్లీ

సోమవారం, 19 జూన్ 2017 (13:00 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఒక్క ఓటమితో యువత భారత జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ ఆటగాళ్ల గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ జట్టుకు అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఈ టోర్నమెంటులో వాళ్లు అద్భుతంగా ఆడారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న విధానం చూస్తేనే వారి ప్రతిభ ప్రతిధ్వనిస్తోంది. వాళ్లు మరోసారి దాన్ని రుజువు చేసుకున్నారు. 
 
వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు ఎవరినైనా తలకిందులు చేయగలరు. ఫకార్ జమాన్ వంటి వారు 80 శాతం పరుగులు అత్యంత రిస్క్ తీసుకుని చేయడంతో వారిని నిలువరించడం కష్టమైంది. ఈ ఓటమి మాకు నిరాశకలిగించే విషయమైనా... ఫైనల్‌కి చేరేందుకు మేము కూడా బాగా ఆడుతూ వచ్చాం. అందుకే నా ముఖంపై ఈ మాత్రమైనా చిరునవ్వు కనిపిస్తోంది.. కొన్నిసార్లు మనం ప్రత్యర్థి ప్రతిభను కూడా సంతోషంగా ఒప్పుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి