టీమ్ ఇండియా 'అమ్మ' సెంటిమెంట్... కివీస్ చిత్తు... 190 పరుగుల భారీ తేడాతో భారత్ సిరీస్ కైవసం

శనివారం, 29 అక్టోబరు 2016 (20:08 IST)
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య విశాఖపట్టణంలో శనివారం నాడు జరిగిన చివరి ఒన్డేలో న్యూజీలాండ్ దారుణమైన ఓటమిని చవిచూసింది. కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్ అమిత్ మిశ్రా న్యూజీలాండ్ బ్యాట్సమన్ల నడ్డివిరిచాడు. ఆరు ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో కివీస్ కష్టాల్లో పడింది. భారత్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడింది. మరోసారి విశాఖ పిచ్ టీమిండియాకు కలిసొచ్చింది.
 
ఇండియన్ క్రీడాకారులంతా తమతమ తల్లులను గౌరవిస్తూ జర్కిన్ల వెనుకవైపు వారి పేర్లతో రావడమూ సెంటిమెంటుగా మారింది. అమ్మల గౌరవార్థం వారు ధరించిన జర్కిన్ల మహిమో, విశాఖ పిచ్ పవరో తెలియదు కానీ టీమిండియా రెచ్చిపోయి ఆడి కివీస్ జట్టును మట్టికరిపించింది. 5 వన్డేల సరీస్ లో 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
 
కివీస్ బ్యాట్సమన్ల ఆట క్రీజులోకి వచ్చిన దగ్గర్నుంచి పెవిలియన్‌కు ఎప్పుడు వెళదామా అన్నట్లు సాగింది. గుప్తిల్ 0, లథామ్ 19, విల్లియమ్సన్ 27, టేలర్ 19, నిషామ్ 3, వాట్లింగ్ 0, ఆండర్సన్ 0, సంత్నెర్ 4, సౌథీ 0, సోధి 0 పరుగులతో కివీస్ పరాజయానికి కారకులయ్యారు.
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్లు... రహానే 20, రోహిత్ శర్మ, 70, విరాట్ కోహ్లి 65, ధోనీ 41, పాండే 0, జాధవ్ 39, పటేల్ 24 పరుగులతో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి