భారత్ కథ కంచికేనా? ఇంకా ఏమైనా ఛాన్సుందా?

సోమవారం, 1 నవంబరు 2021 (10:09 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో చిత్తు చిత్తుగా ఓడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో చావుదెబ్బతిన్న భారత్.. ఆదివారం రాత్రి న్యూజిలాండ్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 
 
నిజానికి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్‌ రేసులో ఉంటుందని భావించారు. కానీ, అభిమానుల ఆశలపై కోహ్లీ సేన నీళ్లు చల్లింది. ఇక మన జట్టు మిగిలిన మ్యాచ్‌ల్లో అప్ఘనిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాలతో ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలోనూ కోహ్లీసేన గెలవొచ్చు. 
 
అయితే ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో పాక్‌ దాదాపు సెమీస్‌ చేరినట్లే. ఇక మనలాగే మూడు చిన్న జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సిన న్యూజిలాండ్‌ వాటిపై గెలిస్తే ముందంజ వేస్తుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఇంకా సెమీస్‌ చేరాలంటే.. ప్రమాదకర జట్టుగా ఈ మధ్య మంచి ప్రదర్శన చేస్తున్న ఆప్ఘనిస్థాన్ జట్టు కివీస్‌ను ఓడిస్తుందేమో చూడాలి. 
 
అప్పుడు భారత్‌ మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ ఘనంగా గెలవడమే కాకుండా న్యూజిలాండ్‌ కన్నా మెరుగైన రన్‌రేట్‌ సాధిస్తే సెమీస్‌ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే అది నిజమవ్వాలంటే అద్భుతాలే జరగాలి. టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన కోహ్లీ సేన చివరికి ఇలా అద్భుతాలపై ఆశలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు