ప్రపంచ మహిళా దినోత్సవం.. టీ20 వరల్డ్ కప్ ఆ రోజే.. అమ్మాయిలకు కలిసొస్తుందా? (Video)

గురువారం, 5 మార్చి 2020 (14:19 IST)
Women’s T20 World Cup Final
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్‌ చేరిన భారత మహిళలు ఫైనల్‌ వరకు వెళ్లిన దాఖలాలు లేవు. అయితే ఈసారి హర్మన్ ప్రీత్ గ్యాంగ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇందుకు వరుణుడే కారణం. ఎట్ట‌కేల‌కి ఆ వరుణుడే భారత క‌ల‌ని నెర‌వేర్చాడు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీస్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో.. గ్రూప్‌-ఎలో టాపర్‌గా ఉన్న భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత మహిళలు తొలిసారి ఫైనల్‌కు చేరారు.
 
ఈ మ్యాచ్ రద్దు అనంతరం భారత కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... వాతావరణం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడం దురదృష్టకరమని చెప్పింది. కానీ ఐసీసీ రూల్స్‌ ప్రకారం తాము ఫైనల్లోకి అడుగుపెట్టాం. భవిష్యత్తులో మెగా టోర్నీల నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే కచ్చితంగా ఉండాలి. ఈ టోర్నీ తొలి రోజు నుంచి మేము ఒకే ఆలోచనతో ఉన్నాం. గ్రూప్‌లో మొత్తం మ్యాచ్‌లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది. టాపర్‌గా నిలిచుండకుంటే ఫైనల్‌కు చేరడం కష్టమయ్యేదని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. 
 
కాగా గ్రూపు లీగులో అన్ని మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్ల‌తో భార‌త్ టాప్‌లో ఉండ‌గా.. ఇంగ్లండ్ చేతిలో ఆరు పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. దీంతో భార‌త్ నేరుగా ఫైన‌ల్‌కి చేరింది. ఇప్పటికే ప్రారంభం కానున్న రెండో సెమీస్‌కి కూడా వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. దీంతో పాయింట్ల పరంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.

ఈ క్ర‌మంలో మార్చి 8న జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికాలు త‌ల‌ప‌డ‌నున్నాయి. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా జరుగనున్న మహిళల ట్వంటీ-20 ఫైనల్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి వుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు