స్టేడియానికి గేట్లు వేయండి : హెచ్‌సీఏకు అజారుద్దీన్ సలహా

సోమవారం, 16 అక్టోబరు 2017 (06:31 IST)
ఒక అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించలేనపుడు క్రికెట్ స్టేడియం ఎందుకంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘంపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్, ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక ట్వంటీ20 మ్యాచ్ జరగాల్సి వుంది. కానీ, హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు మైదానం బాగా తడిసి చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ జరగాల్సిన రోజున వర్షం లేకపోయినా ఆటను రద్దు చేశారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
 
ఇదే అంశంపై అజారుద్దీన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ను నిర్వహించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని... కానీ, హెచ్‌సీఏ ప్రొఫెషనల్‌‌గా వ్యవహరించలేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గౌహతిలో రెండో టీ20కి కూడా వర్షం అడ్డంకిగా మారిందని... అయినా వారు మ్యాచ్‌ను నిర్వహించగలిగారన్నారు. 
 
కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఆ పని చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. వర్షం లేకపోయినప్పటికీ, మ్యాచ్‌ను నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని, అందువల్ల క్రికెట్ స్టేడియం గేట్లకు తాళం వేసుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు. కాగా, ట్వంటీ20 సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో ఉజ్జీలుగా నిలిచిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు