ఐసీసీ ర్యాంకులు: ఒక్కసారిగా టాప్-10లోకి దూసుకొచ్చిన షమీ

ఆదివారం, 17 నవంబరు 2019 (17:46 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో టాప్-10లోకి భారత్ బౌలర్ మహ్మద్ షమీ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. నిజానికి గత కొంతకాలంగా మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. ఈయన ఐసీసీ ర్యాంకుల జాబితాలో ఒక్కసారిగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. 
 
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో షమీ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. గత కొన్నినెలలుగా షమీ అంత నిలకడగా బౌలింగ్ చేస్తున్న ప్రపంచస్థాయి బౌలర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 
 
స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపైనా షమీ చెలరేగుతున్న తీరు క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా నెంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలేని లోటు ఏమాత్రం తెలియడంలేదంటే అది నిస్సందేహంగా షమీ చలవే.
 
ఐసీసీ బౌలర్ల జాబితాలో టాప్‌లో ఆస్ట్రేలియా యువ పేసర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రబాడా, జాసన్ హోల్డర్ ఉన్నారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరమైన బుమ్రా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు పదో స్థానం దక్కింది.
 
ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. పుజారా 4, రహానే 5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా టెస్టు జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న రోహిత్ శర్మ పదో ర్యాంకులోకి చేరాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు