అందరం ఏదో ఒకరోజు పోవాల్సిందే.. నాన్న కల నెరవేర్చు : సిరాజ‌్‌కు తల్లి కర్తవ్య బోధ

సోమవారం, 23 నవంబరు 2020 (21:17 IST)
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్. ఐపీఎల్ 2020లో అద్భుతంగా రాణించిన ఈ కుర్రోడు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టులో ఉన్నాడు. ఈ సంతోషం సిరాజ్‌కు ఎంతో సేపు నిలవలేదు. ఆయన తండ్రి మహ్మద్ గౌస్ (53) ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందారు. తండ్రి కడసారి చూపుకు కూడా సిరాజ్ నోచుకోలేక పోయాడు. 
 
భారత్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని బీసీసీఐ చెప్పినా, సిరాజ్ భారత జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను టీమిండియాకు ఆడాలన్నది తన తండ్రి కోరిక అని, ఆయన కోరిక ప్రకారం దేశం తరపున క్రికెట్ ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించి తన స్ఫూర్తిని చాటాడు.
 
ఈ నేపథ్యంలో సిరాజ్ తాజాగా ఓ వీడియోలో మాట్లాడుతూ, తన తల్లి ఏంచెప్పిందో వివరించాడు. "ఇవాళ మీ నాన్న, రేపు నేను... అందరం ఏదో ఒకరోజు పోవాల్సిందే. నాన్న కల నెరవేర్చు. నాన్న కోసం భారత్ తరపున మెరుగైన క్రికెట్ ఆడు అని చెప్పింది. ఈ కష్ట సమయంలో మా అమ్మ నాకెంతో ధైర్యం నూరిపోసింది" అని వివరించాడు. 
 
ఈ లోకంలో లేనప్పటికీ తన తండ్రి ఎల్లప్పుడూ దగ్గరగానే ఉన్నట్టు భావిస్తానని తెలిపాడు. పైగా, తండ్రి మరణం తీర్చలేని లోటు అని, అయితే టీమిండియా సభ్యులు తనను ఓదార్చిన తీరు పట్ల వారి రుణం తీర్చుకోలేనని సిరాజ్ పేర్కొన్నాడు. జట్టు సహచరులు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారన్నారు. 
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో మద్దతు ఇస్తున్నాడని, ఈ కష్టకాలంలో గుండె నిబ్బరం చేసుకుని నిలబడితే మున్ముందు అదెంతో సాయపడుతుందని కోహ్లీ పేర్కొన్నాడని వివరించాడు. మరోవైపు, బీసీసీఐతో పాటు.. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ఈ కష్టకాలంలో సిరాజ్‌ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు