కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

ఠాగూర్

ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (17:10 IST)
కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది. ఈ ఘటనలో 67 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించారు టీవీకే చీఫ్ విజయ్. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ జస్టిస్ ఎం. దండపాణి నివాసంలో తమ న్యాయవాదుల బృందం అత్యవసరంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు  టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ వివరించారు. 
 
శనివారం సాయంత్రం కరూర్ లోని వేలుసామిపురంలో జరిగిన ఈ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇరుకైన దారుల్లో తొక్కిసలాట జరిగి ఊపిరాడక, కాళ్ల కిందపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది చిన్నారులు, అధికశాతం మహిళలు ఉన్నారు. 
 
మరో 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు