మీరు రాకపోతే.. మేమూ రాము.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపు (video)

ఆదివారం, 26 జనవరి 2020 (11:32 IST)
ముంబై పేలుళ్ల అనంతరం భారత్- పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ఇండో-పాక్ సరిహద్దు వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. ఇలా పాకిస్థాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టి 15 ఏళ్లయింది. 
 
చివరిసారిగా భారత్ 2005-06 సీజన్‌లో పాకిస్థాన్‌లో పలు మ్యాచ్‌లు ఆడింది. ఉగ్రవాదం కారణంగా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం బెదిరింపులకు దిగింది. ఈ సెప్టెంబరులో తమ గడ్డపై జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు రావాల్సిందేనని, లేకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కు తమ జట్టు రాదని హెచ్చరించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ వెల్లడించారు. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనకపోతే తాము టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరి ఈ బెదిరింపులను బీసీసీఐ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు