నా పేరు తీసేస్తారా? మీకెంత ధైర్యం.. బ్యాట్ పట్టిన ధోనీ..!

శనివారం, 18 జనవరి 2020 (14:46 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన బ్యాటుకు పని చెప్పాడు. అది కూడా బీసీసీఐ కాంట్రాక్టు జాబితా నుంచి పేరును తొలగించిన రోజే అతను మైదానంలోకి అడుగుపెట్టడం విశేషం.199 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పనిచేసిన ధోనీ పేరును కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించి అవమానకర రీతిలో బీసీసీఐ వ్యవహరించడంపై ఆయన ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. కనీసం మాటకూడా చెప్పకుండా ధోనీ పేరును కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడం సరికాదని ఫైర్ అవుతున్నారు. 
 
ప్రపంచ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా వున్నాడు. సైనిక సేవల కోసం రెండు నెలలు సెలవు పెట్టిన ధోనీ ఆ తర్వాత కూడా మైదానంలోకి అడుగు పెట్టలేదు. తను రిటైర్ కాబోతున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో అతని కెరీర్ ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే మిస్టర్ కూల్ మాత్రం ఎంత జరుగుతున్న నోరు విప్పలేదు. ఇంకా జార్ఖండ్ రంజీ జట్టులో కలిసి సాధన మొదలెట్టాడు.
 
త్వరలో జరగనున్న ఐపీఎల్‌లో తన సత్తా ఏమిటో నిరూపించి బీసీసీఐకి పరోక్షంగా తన అవసరాన్ని తెలియజేసే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆటగాళ్లంతా ఎరుపు బంతితో సాధన చేస్తే ధోనీ మాత్రం తెలుపు బంతితో సాధన చేశాడు. అతను ఓ బౌలింగ్ యంత్రాన్ని కూడా సమకూర్చుకున్నాడని సమాచారం. 
 
ఇక ధోనీ రంజీ ఆడటంపై రంజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. మాతో కలిసి మైదానంలో ఉన్నాడన్న భావనే మాకు గొప్ప శక్తినిస్తుందని.. చాలాసేపు ధోనీ బ్యాటింగ్ చేశాడంటూ రంజీ జట్టు ఆటగాళ్లు వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు