వన్డే ప్రపంచ కప్ : ఆప్ఘనిస్థాన్‌పై భారత్ అలవోక విజయం

బుధవారం, 11 అక్టోబరు 2023 (22:36 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, భారత్ బుధవారం తన రెండో మ్యాచ్‌ను ఆడింది. క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుతో తలపడిన భారత్... 273 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని 35 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా గెలుపొందింది. దీంతో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టుపైనా గెలుపొంది, ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరుకు సిద్ధమైంది. 
 
ఆఫ్ఘన్ జట్టు నిర్దేశించిన 273 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కేవలం 35 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక సెంచరీతో భారత్ విజయానికి బాటలు వేశాడు. రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ దాడులను తుత్తునియలు చేసిన హిట్ మ్యాన్ ఏకంగా 16 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా రోహిత్ వశమయ్యాయి.
 
మరో ఎండ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 47 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సెంచరీ అనంతరం రోహిత్ శర్మ కూడా ఔవుటైనప్పటికీ, విరాట్ కోహ్లి (55 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (25 నాటౌట్) మరో వికెట్ పడకుండా టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు 2 వికెట్లు తీశాడు. 
 
ఇవాళి మ్యాచ్‌లో మరో ఆసక్తికర దృశ్యం కూడా కనిపించింది. ఐపీఎల్ సందర్భంగా తీవ్ర స్థాయిలో మాటలు విసురుకున్న ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్, టీమిండియా మాజీ సారథి కోహ్లి హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఇరువురు గత వివాదానికి ముగింపు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు