టెండూల్కర్ అవుట్: దక్షిణాఫ్రికా మూడోరోజు స్కోరు 52/2

కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండర్ కలిస్ ఆదుకుంటే, టీమిండియాను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్ జోడీ ఆదుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో టెస్టు మూడు రోజుల ఆట ముగిసినా ఏ జట్టూ గెలుపు బాటలో పయనించడం లేదు. మూడో టెస్టులో ఏ జట్టుకు విజయమనే విషయం తేలేది రెండో ఇన్నింగ్స్‌లోనే.

కాగా మూడో రోజు ఆటలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (146) తన టెస్టు క్రికెట్‌లో 51 శతకాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ వేదికల్లో మాస్టర్ సచిన్ 97 సెంచరీలు సాధించిన ఘనతకెక్కాడు. ఇంకా వంద శతకాల రికార్డును మూడు సెంచరీల దూరంలో నిలిచాడు.

కేప్‌టౌన్ టెస్టులో 51వ సెంచరీని సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన సచిన్, తన టెస్టు కెరీర్‌లో అత్యధిక పరుగుల స్కోరును నమోదు చేసుకున్నాడు. అయితే నాలుగు పరుగుల దూరంలో 150 పరుగుల మార్కును సచిన్ కోల్పోయాడు. ఇదేవిధంగా మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఏడు పరుగుల దూరంలో గంభీర్ శతకాన్ని కోల్పోయాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364కు ఆలౌటైంది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మంగళవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించింది. ఓపెనర్లిద్దరూ కలిసి 50 పరుగులు చేసి శుభారంభాన్ని అందించినా.. ఆ తర్వాత రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లే బౌలింగ్ చేసి ఈ రెండు వికెట్లు తీయడం విశేషం. జట్టు స్కోర్ 50 పరుగుల వద్ద ఓపెనర్ స్మిత్ (29), 52 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాట్స్‌మన్ హారిస్‌లు భజ్జీకి దొరికిపోయారు. ప్రస్తుతం పీటర్సన్ (22), ఆమ్లా (0)లు క్రీజులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి