ఓపెనర్ల వీర విజృంభణకు తోడుగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కూడా చెలరేగటంతో కటక్లో జరిగిన అయిదో వన్డేలో కూడా ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం సాధించి ఏడు వన్డేల సీరీస్లో 5-0 ఆధిక్యతతో నిలిచింది. 270 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు సెహ్వాగ్, సచిన్లు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా సెహ్వాగ్ 15 ఫోర్లు, 1 సిక్స్తో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
మరోవైపు సచిన్ కూడా క్రీజులో దీటుగా నిలబడి అర్థ సెంచరీ చేయడంతో భారత్ 20 ఓవర్లు పూర్తి కాకముందే 136 పరుగులు చేసి అయిదో విజయానికి చేరువైంది. తర్వాత 3 ఓవర్లలోపే భారత్ వరుసగా సచిన్ -50-, యువీ -6-, సెహ్వాగ్ -91- వికెట్లను కోల్పోవడంతో ఆట ఇంగ్లండ్ వైపు మొగ్గు చూపింది.
తర్వాత బరిలో దిగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ -50- రోహిత్ -53 నాటవుట్- పరుగులతో భారత్కు సునాయాస విజయాన్ని అందించారు. దీంతో భారత్ 38 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టుపై అయిదో వన్డేలోనూ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ జట్టులో హర్మిసన్, బ్రాడ్, స్వాన్, బొపారాలు తలొక వికెట్ పడగొట్టినప్పటికీ ఊపు మీదున్న భారత్పై ఏ మాత్రం ప్రభావం వేయలేకపోయారు.
అంతకు ముందు పీటర్సన్ -111-, కాలింగ్వుడ్ -40-, షా -66- పరుగులతో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. పీటర్సన్ సీరీస్లో తొలిసారిగా మంచి ఆట ప్రదర్శించి 111 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. భారత్ జట్టులో జహీర్ ఖాన్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ, హర్భజన్ చెరొక వికెట్ పడగొట్టారు.
సెంచరీకి చేరువై అనూహ్యంగా అవుట్ అయినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సెహ్వాగ్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించంది.