మహిళల ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగో విజయం.. వీళ్లపైన ఇంత చిన్న చూపా

గురువారం, 6 జులై 2017 (01:53 IST)
టీమిండియా పురుషుల జట్టుకు కూడా సాధ్యం కాని అమోఘ విజయాన్ని  మన అమ్మాయిలు సాధించారు. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్‌ విసిరిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన లంక.. 47.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 216 పరుగులు మాత్రమే చేసింది.

 






















శ్రీలంక బ్యాటింగ్‌ విమన్స్‌లో సురాంగిక 61(75 బంతుల్లో), సిరివర్ధనే37(63 బంతుల్లో) తప్ప మిగతావారంతా అవసరమైన మేరకు రాణించలేదు. ఓపెనర్‌ హన్సిక 29, జయాంగని 25, వీరక్కోడి 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జులన్‌ గోస్వామి, పూనమ్‌ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, బిస్త్‌, శర్మలు చెరో వికెట్‌ నేలకూల్చారు.
 
అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది. భారత్ బ్యాటింగ్ ఉమెన్ లో దీప్తీ శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53)లు రాణించారు. ఇక చివర్లో వేద కృష్ణమూర్తి(29), హర్మన్ ప్రీత్ కౌర్(20) లు దాటిగా ఆడటంతో భారత్ 200 పై చిలుకు పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి విరొక్కడే 3 వికెట్లు తీయగా రణవీర(2), కాంచన, గుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. జులై 8న (శనివారం) లీసెస్టర్ వేదికగా భారత్‌-సఫారీలు పోటీపడనున్నాయి.
 
ప్రపంచ క్రికెట్ యవనికపై ఇంత అనితర సాధ్య విజయాలు సాధిస్తున్న మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కానీ, మీడియా కానీ, రాజకీయ నాయకత్వం కానీ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. రెమ్యునరేషన్ కానీ, మీడయాలో ప్రచారం కానీ ఎంతో తక్కువ. చివరికి టీవీల్లో కూడా ఇంత ప్రాధాన్యత కలిగిన టోర్నిని ప్రసారం చేయరు. వై.. మహిళా క్రికెట్‌ను ఇంతగా చిన్నచూపు చేస్తున్నదెవరు? 
 
కోహ్లీ భజన చేయడం మాని, మన మగ క్రికెటర్ల అహంభావాల్ని, భేషజాల్ని ఆహో ఓహో అని కీర్తించడం మాని మన అమ్మాయిలను ఇక పట్టించుకుందామా?  
 

వెబ్దునియా పై చదవండి