వాఖండేలో మాస్టర్ బ్లాస్టర్ వందో సెంచరీ సాధిస్తాడా!?

సోమవారం, 21 నవంబరు 2011 (15:46 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఖాతాలో ప్రపంచకప్‌ గెలుచుకునేందుకు వేదికైనా వాఖండే స్టేడియం మాస్టర్ వందో సెంచరీకి వేదికవుతుందా అనేది తెలియాలంటే.. విండీస్‌తో మంగళవారం ప్రారంభం కానున్న ఫైనల్ టెస్టు వరకు ఆగాల్సిందే.

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డులతో ఓ వెలుగు వెలుగుతున్న సచిన్ ఖాతాలో ప్రపంచకప్ రికార్డ్ వాఖండే స్టేడియంలోనే నమోదైంది. ఏప్రిల్ రెండో తేదీన జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వాఖండే స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ స్టేడియంలో భారత్ విజయకేతనం ఎగరవేయడం ద్వారా మాస్టర్ ఖాతాలో ప్రపంచకప్ కూడా తోడైంది. ఇదే స్టేడియంలో వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి చివరిదైన మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ స్టేడియం వేదికగా మాస్టర్ వందో సెంచరీ సాధిస్తాడని క్రికెట్ అభిమానులు సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు.

22 ఏళ్ల తర్వాత టీమిండియాకు వాఖండే వేదికగా ప్రపంచకప్ సాధించిన నేపథ్యంలో, విండీస్‌తో జరిగే చివరిటెస్టులోనూ మాస్టర్ వందో సెంచరీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని యావత్తు క్రికెట్ ప్రపంచం ఆత్రుతతో ఎదురుచూస్తోంది.

ఇప్పటివరకు ఓవల్ మైదానంలో (ఇంగ్లండ్) 91, కోట్లాలో 76, ఈడెన్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లాడినప్పటికీ మాస్టర్ వందో సెంచరీ సాధించలేకపోయాడు. అయితే వాఖండే స్టేడియంలో మాస్టర్ తప్పకుండా వందో శతకాన్ని నమోదుచేసుకుంటాడని అభిమానులు అంటున్నారు. మరి వందో సెంచరీ సాధించేందుకు తొందరెందుకు అన్న సచిన్ శతకాన్ని సాధిస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి