కొడుకును చంపిన మహిళా సీఈవోను ట్యాక్సీ డ్రైవర్ ఎలా పట్టించాడంటే...

ఠాగూర్

శుక్రవారం, 12 జనవరి 2024 (17:09 IST)
ఇటీవల నాలుగేళ్ల తన కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో నడిచే ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్‌‍ను ఆమె ప్రయాణించిన ట్యాక్సీ డ్రైవర్ రే జాన్ ఎంతో చాకచక్యంగా గోవా పోలీసులకు పట్టించాడు. ఈ విషయాలను ఆయన తాజాగా వెల్లడించారు. ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు పూర్తిగా సహకరించి ఖాకీలు చెప్పినట్టు నడుచుకోవడంతో సుచనా సేథ్‌ పోలీసుల వలలో ఈజీగా చిక్కిపోయింది.
 
తన కుమారుడిని హత్య చేసిన సుచనా సేథ్.. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో దాచిపెట్టింది. ఆ తర్వాత ట్యాక్సీని బుక్ చేసుకుంది. దీంతో ట్యాక్సీ డ్రైవర్ ఆ మహిళ ఉండే సర్వీస్ అపార్టుమెంట్‌కు రాగానే.. తన లగేజ్‌ను కారులో పెట్టాలని కోరింది. కానీ, అది చాలా బరువుగా ఉందని, అందులోని కొంత లగేజీని తీసేయాలని డ్రైవర్ కోరగా, ఆమె నిరాకరించింది. ఆ తర్వాత లగేజీతో పాటు ఆమెను ఎక్కించుకుని బెంగుళూరు వైపు వెళ్లినట్టు డ్రైవర్ జాన్ చెప్పాడు. 
 
అయితే, ఆ రోజున కర్నాటక గోవా సరిహద్దుల్లోని కోర్లా ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఉన్న పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి కనీసం నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పారు. అయితే, తనకున్న అనుభవంతో ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు కనీసం ఆరు గంటల సమయం పడుతుందని సుచనా సేథ్‌కు చెప్పినట్టు జాన్ తెలిపాడు. ఆ క్రమంలో వెనక్కి వెళ్లి ఆమెను విమానాశ్రయంలో డ్రాప్ చేయాలా అని ఆయన కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. 
 
అపుడే ఏదో తప్పు జరిగిందని తాను గ్రహించానని, ఆ సమయంలోనే తనకు పోలీసుల నుంచి కాల్ రావడంతో, తనతో ప్రయాణిస్తున్న మహిళ తీరు అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు చెప్పినట్టుగా ట్యాక్సీ డ్రైవర్ నడుచుకోవడమేకాకుండా, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేలా ఆదేశించారు. దీంతో కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలోని ఈయమంగళ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా, అక్కడకు గోవా పోలీసులు వచ్చి సుచనా సేథ్‌ను అరెస్టు చేసినట్టు డ్రైవర్ వివరించాడు. ఆమె లగేజీ బ్యాగును తెరిచి చూడగా, అందులో బాలుడి మృతదేహం ఉందని చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు