నమ్మి వచ్చిన డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

మంగళవారం, 4 జులై 2023 (08:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. తన స్నేహితులే కదా అని నమ్మి వెళ్లినందుకు ఆమెపై లైంగికదాడి జరిగింది. మొత్తం ఏడుగురు మిత్రుల్లో ఒకడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్‌కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు బైక్‌లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్‌ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగారు. 
 
ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన విద్యార్థినిని... ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్‌ అనే విద్యార్థి మాట్లాడే పనుందని చెప్పి... రింగ్‌ రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై పారిపోయాడు. 
 
మిగతా మిత్రులు బాధితురాలిని వరంగల్‌లో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు