డీబార్ చేశారన్న కోపంతో ప్రిన్సిపాల్‌పై బ్లేడుతో విద్యార్థి దాడి..

శుక్రవారం, 30 జూన్ 2023 (08:52 IST)
ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. బ్లేడుతో కాలేజీ ప్రిన్సిపాల్‌‍పై దాడి చేశాడు. పరీక్షల్లో కాపీ కొట్టినందుకు తనను డీబార్ చేశారన్న కోపంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిద్దలూరు పట్టణంలోని చిన్నమసీదు ప్రాంతంలో ఉండే గొంట్ల గణేశ్‌ స్థానిక సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గత యేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్బంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచి అతడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిగిపోయాడు. 
 
స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డిపై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో అతడు కొండారెడ్డి గొంత కోయబోతుంటే ఆయన చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి, గొంతు వద్ద చిన్నపాటి గాయమైంది. దీన్ని గుర్తించిన స్థానికులు కొండారెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు