యువతి ప్రేమను తిరస్కరించిన ఉపాధ్యాయుడు... జైలు ఊచలు లెక్కిస్తున్న యువతి

వరుణ్

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (08:27 IST)
పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపై ఓ యువతి మనసుపడింది. కానీ ఆయన ఆమె ప్రేమను తిరస్కరించారు. దీంతో ఆ టీచరుపై ఆ యువతి కక్షగట్టింది. ఆయన 11 యేళ్ల కుమార్తె పరువు తీసేందుకు ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ వికటించింది. ఫలితంగా అడ్డంగా దొరికిపోయింది. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ నగర సీసీఎస్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీపీ కవిత, ఏసీపీ చాంద్ బాషాలు మీడియాకు వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన 24 యేళ్ల యువతి గ్రూప్-1 శిక్షణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చింది. స్థానిక అశోక్ నగర్‌లోని ఓ శిక్షణ సంస్థలో చేరిన ఆమె, అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసుపారేసుకుంది.తాను ప్రేమిస్తున్న విషయాన్ని అధ్యాపకుడికి చెప్పగా.. తనకు భార్యాపిల్లలున్నారని చెబుతూ మందలించారు. దీంతో ఆయనపై ఆమె పగ పెంచుకుంది. అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. 
 
ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అధ్యాపకుడి కుటుంబ చిత్రాలతోపాటు 11 ఏళ్ల ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేసింది. అధ్యాపకుడు పనిచేసే శిక్షణ సంస్థ, హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సప్ గ్రూపుల్లోనూ అశ్లీలతతో కూడిన పదజాలంతో ఆయా పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేయసాగింది. ఇది అధ్యాపకుడి దృష్టికి రావడంతో ఆయన నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సైదులు బృందం సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని అనంతపురంలో గురువారం అరెస్టు చేసింది. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు