ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై ఓ కామాంధుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. వారి ఇంట్లో పని చేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై దాడి చేసి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాడి అనంతరం ఇంట్లో దోపిడీకి పాల్పడినట్టు తేలింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, రాహుల్ నేరుగా ఐఆర్ఎస్ అధికారి ఇంటి పైఅంతస్తులో ఉన్న స్టడీరూమ్లోకి వెళ్లాడు. అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. యువతి ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న బలమైన వస్తువులతో ఆమెపై దాడి చేసినట్లు అతడు విచారణలో తెలిపాడు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెపై.. అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అనంతరం అతడు ఇంట్లో దోపిడీకి కూడా యత్నించాడు.
ఆ ఇంట్లో ఉన్న సేఫ్లాక్ బయోమెట్రిక్ సిస్టమ్తో పనిచేస్తుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాడి తర్వాత అచేతనంగా పడి ఉన్న బాధితురాలిని స్టడీరూమ్ నుంచి గ్రౌండ్ఫ్లోర్కు ఈడ్చుకొచ్చాడు. రక్తపు మరకలు ఉన్న ఆమె వేలితో సేఫ్లాక్ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యపడకపోవడంతో.. ఓ స్క్రూ డ్రైవర్తో సేఫ్లాక్ను ఓపెన్ చేసి అందులోని నగదు, బంగారాన్ని దొంగిలించాడు. వాటి మొత్తం విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి.. దుస్తులపై రక్తపు మరకలు పడటంతో అవి మార్చుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఢిల్లీ ఘటనకు ముందురోజు రాహుల్ ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్లోని అల్వార్లో తన ఇంటిపక్కన ఉన్న మహిళను అత్యాచారం చేసి.. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఆమెను బెదిరించాడని, అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు పైనా దర్యాప్తు ప్రారంభించారు.