నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయిన 11 నెలల బాలుడు

మంగళవారం, 18 జులై 2023 (15:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 11 నెలల బాలుడు నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కథన వివరాలను పరిశీలిస్తే, రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కల దేవీ లక్ష్మణ్, గీత దంపతులు కట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
సోమవారం సాయంత్రం దంపతులిద్దరు కుట్టుపనిలో నిమగ్నం కాగా, వారి చిన్న కుమారుడు హేమంత్ (11నెలలు) అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో హేమంత్ పక్కనే ఉన్న నీటి బకెట్ వద్దకు వెళ్లి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. అప్పటివరకు అక్కడే ఆడుకుంటున్న తమ కుమారుడు కనిపించకపోవడంతో తల్లి కంగారు పడుతూ వెతకడం మొదలు పెట్టింది. 
 
ఈ క్రమంలో నీటి బకెట్లో పడి శ్వాస తీసుకోలేక విలవిలలాడుతుండడాన్ని తల్లి చూసింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అప్పటివరకు తల్లిదండ్రుల ముందే సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు