బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

ఠాగూర్

సోమవారం, 2 జూన్ 2025 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాను అడిగిన బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదన్న కోపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసే స్థోమత లేదని చెప్పినప్పటికీ ఆ యువకుడు పట్టించుకోలేదు కదా.. తీవ్ర మనస్థాపానికిలోనై... పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చాట్లపల్లి గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు జానీ (21) కొద్ది రోజుల క్రితం బీఎండబ్ల్యూ కారు కావాలని తండ్రిని అడిగాడు. అయితే, అంత డబ్బు తన వద్ద లేదని, బీఎండబ్ల్యూకు బదులుగా స్విఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య చెప్పాడు. ఆ తర్వాత సిద్ధిపేటలోని ఓ కార్ల షోరూమ్‌కు తన కుమారుడుతో కలిసి వెళ్లిన కనకయ్య... స్విఫ్ట్ కారును చూపించాడు. అయితే, ఆ కారు నచ్చకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. 
 
ఈ క్రమంలో తాను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగుల మందు సేవించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు