తమ కుమార్తెను వేరే కులపోడు ప్రేమించాడనీ... అత్యంత కిరాతకంగా చంపేశారు.. ఎక్కడ?

శుక్రవారం, 10 నవంబరు 2023 (09:41 IST)
తమ కుమార్తెను వేరే కులానికి చెందిన యువకుడు ప్రేమించడాన్ని ఆ యువతి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ యువకుడి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో కక్ష కట్టిన యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్ సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేస్ సమీపంలోని అన్నోజిగూడ - శ్రీలక్ష్మినరసింహా కాలనీకి చెందిన కరుణ నాయక్ (18) అనే యువకుడు నీరు సరఫరా చేసే ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తున్నారు. తండ్రి మరణించడంతో తల్లి యాదిబాయ్‌తో కలిసి జీవిస్తున్నాడు. ఈ యువకుడు అదే కాలనీకి చెందిన 15 యేళ్ల బాలికను ప్రేమిస్తూ వచ్చాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. మరో కులానికి చెందిన యువకుడు తమ కుమార్తెను ప్రేమించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కరుణా నాయక్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కక్షగట్టారు. 
 
ఇదిలావుంటే, బుధవారం బాలిక తల్లిదండ్రులు స్థానికంగా శుభకార్యానికి వెళ్లారు. అప్పుడు ఆ యువతి మాత్రమే ఇంట్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న కరుణా నాయక్.. అర్థరాత్రి సమయంలో నేరుగా ఇంటికెళ్లాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు వెంటనే తిరిగివచ్చారు. కరణ్ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టారు. స్థానికంగా మరికొందర్ని పిలిపించుకుని ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. యువకుడిని ఇష్టారీతిన చితకబాదారు. 
 
నగ్నంగా చేసి తాళ్లతో కట్టేశారు. అతడి రహస్యభాగాలపై కారం చల్లుతూ.. కర్రలతో కొడుతూ దాదాపు గంటపాటు చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆ యువకుడు అపస్మారకస్థితిలోకి జారుకుని, కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. కొందరు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ ఎం.మహేందర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున రెడ్డి.. సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన బాలిక తల్లిదండ్రులు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. స్థానికంగా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు