డీఎల్ ఇష్యూ డైవర్ట్...? తెలంగాణ అంటూ ఢిల్లీలో హంగామా...!!

మంగళవారం, 4 జూన్ 2013 (22:25 IST)
FILE
రాష్ట్ర మంత్రిమండలి నుంచి మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి భర్తరఫ్ వ్యవహారం ఒకవిధంగా రాష్ట్రంలోని మంత్రిమండలిని ఓ కుదుపు కుదిపేసిందనే చెప్పాలి. ఈ వ్యవహారంపై లోలోన చాలామంది నేతలు రగులుతున్నారని సమాచారం. మూడు దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు వీల్లేకుండా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి తాళాలు వేయడంతో చాలామంది దీనిపై కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం మధ్యాహ్నం సీఎం ప్రవేశపెట్టిన, పేరు మార్చి ప్రచారం చేస్తున్న పథకాలు అంటూ డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖానికి రంగులేసుకుని పేపర్లుకు ఫోజులిస్తూ పథకాలంటూ ప్రచారం చేస్తే పేదవారికి న్యాయం జరుగుతుందా అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు... వచ్చే ఎన్నికల్లో నిజం ఏమిటో ప్రజలే ఓటుతో నిగ్గదీసి కడిగేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సమస్యను అలా వదిలేస్తే తీవ్రమవుతుందని అనుకున్నారో ఏమోగానీ, కాంగ్రెస్ హైకమాండ్ హఠాత్తుగా మంగళవారం రాత్రి తెలంగాణా ఇష్యూను మరోసారి దుమ్ము దులిపింది. దీంతో ముఖ్యనేతలు... అంటే మంత్రివర్గంలోని మంత్రులను ఢిల్లీకి పిలిపించి మంతనాలు ప్రారంభించింది. తెలంగాణపై తాజా చర్చలతో ఇక డీఎల్ వ్యవహారం అంతటితో అయిపోయినట్లేనా... సీఎం వ్యతిరేక వర్గం సైలెంట్ అయిపోయినట్లేనా.... చూడాల్సిందే. కాకపోతే ఇవాళ సాయంత్రం, కేంద్రమంత్రి చిరంజీవి పీసీసి చీఫ్ బొత్సలు చాలాసేపు భేటీ అయి మాట్లాడుకున్నారు. వారు ఏ విషయమై మాట్లాడుకున్నారు... ఏం జరుగుతుందన్నది వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి