'పసుపు కుంకుమ' దెబ్బకొట్టేలా ఉంది.. ఏం చేద్దాం : పార్టీ నేతలతో జగన్ మంతనాలు!!

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:03 IST)
ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర శాసనసభకు ఈనెల 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార టీడీపీ, విపక్ష వైకాపా, హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ పార్టీల అధినేతలతో పాటు... పార్టీ నేతలు, అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు వైకాపాకు చావోరేవోగా మారాయి. అలాగే, టీడీపీ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 
 
అయితే, నిన్నటివరకు విజయంపై ధీమాగా ఉన్న వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి... వ్యూహరచన పేరుతో ప్రచారానికి రెండు రోజుల పాటు విశ్రాంతి నిచ్చారు. ఈ రెండు రోజులు పార్టీకి చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించి మంతనాలు నిర్వహిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్వా సంఘంలో సభ్యులుగా మహిళలకు రూ.10 వేలు చొప్పున నగదు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే తొలి దశ నగదును పంపిణీ చేసింది. ఈ పసుపు కుంకుమ పథకం టీడీపీకి ఓట్ల వర్షం కురిపించనుందని పలు సర్వేల్లో తేలింది. దీంతో ఈ పథకాన్ని ఆపాలంటూ వైకాపా నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పథకం ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అమలు చేసిందనీ, అందువల్ల ఈ పథకం అమలును నిలుపుదల చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
ఇది వైకాపాకు గట్టి షాక్‌లా మారింది. పైగా, రెండో విడత పసుపు కుంకుమ పథకం కింద నగదు బదిలీకి ప్రభుత్వం సమ్మతం తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక వైకాపా అధినేత జగన్ రెండో రోజుల పాటు తన ప్రచారానికి విరామం ఇచ్చి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వ్యూహరచన చేస్తున్నారు. ఈ దఫా వైకాపాను పసుపు-కుంకుమ పథకం దెబ్బకొడుతుందని అంతర్గత సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తుండటంతో జగన్‌ ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు ఈ దఫా గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళా ఓటర్లు గణనీయంగా పెరిగారు. అంటే ఒక పార్టీ గెలుపోటములను శాసించే స్థాయిలో మహిళా ఓటర్లు ఉన్నారు. 
 
దీనికితోడు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుతుంది. ఇదే జరిగితే అంతిమంగా తెలుగుదేశం పార్టీకే లబ్ది చేకూరే అవకాశం ఉంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది. ఈ రెండు అశాలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయన వ్యూహరచనలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు