బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిగా గంగూలీ? కమలనాథుల వ్యూహం!

బుధవారం, 26 ఆగస్టు 2020 (08:18 IST)
తమకు కొరకరానికొయ్యిగా మారిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించేందుకు మోడీ - షా ద్వయం ఓ ప్రణాళికను సిద్ధం చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ మాజీ క్రికెటర్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేరును ప్రకటించాలన్న తలంపులో ఉన్నట్టు వినికిడి. అపుడే మమతా బెనర్జీకి సరైన పోటీ ఇవ్వగలరన్న భావన కమలనాథుల్లో నెలకొంది. అందుకే ఆ దిశగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ఛీప్ జేపీ నడ్డాలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. వెస్ట్ బెంగాల్ పొలిటికల్ పిచ్‌పై జరుగుతున్న చర్చను ఓసారి పరిశీలిస్తే, 
 
'ఒకే దేశం.. ఒకే పార్టీ' అన్న నినాదంతో కాషాయ దళం ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా, ఒక్కో రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించి అధికారాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో కాషాయ జెండాను మోడీ - షా ద్వయం ఎగురవేసింది. అత్తెసురు సీట్లు ఉన్న రాష్ట్రాల్లో సైతం ప్రలోభాల ఆశ చూపి, ప్రజాబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాలను నిలువునా కూల్చి (కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా) తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
 
ఇపుడు తమను అనునిత్యం ఎదిరిస్తూ, సవాల్ చేస్తున్న వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెను ఎలాగైనా గద్దెదించి, తమ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని పరితపిస్తున్నారు. ఇందుకోసం చరిష్మా ఉన్న ప్లేయర్లపై బీజేపీ ఫోకస్ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో క్రికెటర్ల గ్లామర్‌ను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసినట్టుగా డిబేట్ ఊపందుకుంది.
 
ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీకొట్టేది గంగూలీ అంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలం పెరింగింది. కానీ అక్కడ కాషాయ పార్టీకి సరైన ఫేస్ లేదు. దీంతో గంగూలీపై బీజేపీ దృష్టి పెట్టినట్లుగా కథనాలు వస్తున్నాయి. 
 
ఇక గంగూలీ విషయానికి వస్తే, భారత క్రికెట్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఇంకా చెప్పాలంటే అన్ని దేశాల్లోనూ విజయాల రుచి చూపించాడు. గంగూలీకి ముందు ఆ తర్వాత అనుకునేలా సక్సెస్ సాధించాడు. అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు గంగూలీ. అటు బెంగాల్ యూత్‌లో యమ క్రేజ్ ఉంది. బీజేపీకి అదే అడ్వాంటేజ్ అవుతుందని అంచనాలున్నాయి.
 
బీజేపీ బేస్ అంతా యూత్. గంగూలీ ఫాలోయింగ్ కూడా కలిస్తే వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావొచ్చని కాషాయ పార్టీ భావిస్తోంది. దాదా గ్లామర్ ఖచ్చితంగా ఓట్లు కురిపిస్తుందని నమ్ముతోంది. ఇప్పటికే బెంగాల్‌లో బబుల్ సుప్రియో వంటి స్టార్ సింగర్ సెలబ్రిటీలను బీజేపీ రంగంలోకి దించింది. 
 
బబుల్ సుప్రియో కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు తృణమూల్ కూడా హీరోయిన్లను రంగంలోకి దింపారు. అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతను దెబ్బతీయాలంటే గంగూలీని అస్త్రంగా సంధించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అయితే, బీజేపీ వ్యూహంలో గంగూలీ చిక్కుకుంటారా లేదా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు