ఆ ఎన్నికల తర్వాత బీజేపీతో జనసేన కటీఫ్.. ఎందుకంత నిర్ణయం..!

ఆదివారం, 24 అక్టోబరు 2021 (21:20 IST)
బిజెపి జనసేన కూటమి ఏపీలో బలంగా ఉంది. మేము వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటాం. కలిసికట్టుగా పని చేస్తున్నాం ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తాం. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మా కూటమి చాలా బలంగా ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పిన మాటలివి.
 
బిజెపి జనసేన పార్టీల నేతలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదు. ఒకవేళ ప్రజా సమస్యలపై పోరాటానికి పిలుపునిచ్చిన అంటీ అంటనట్లు నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు. రెండు పార్టీల నాయకుల మధ్య అదే పరిస్థితి.
 
ఏపీలో బీజేపీ జనసేనలు కలిసి లేవు వేరుగానే ఉన్నాయంటూ అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. బద్వేలు ఉప ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేనతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా బిజెపి పోటీలో దిగింది. ఇది పవన్ కళ్యాణ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
 
తనను సంప్రదించకుండానే బీజేపీ నాయకులు బద్వేలులో పోటీకి దిగడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదట. టిడిపి లాంటి ప్రధాన ప్రతిపక్షమే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటే బిజెపి ఎందుకు పోటీలో లో దిగిందని మనోహర్ ను ప్రశ్నించారట పవన్ కళ్యాణ్.
 
కొత్త సంస్కృతికి తెర లేపడం ఎంత మాత్రం మంచిది కాదని, దిగజారుడు రాజకీయాలు వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారట. గతంలో కూడా తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా బిజెపి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
 
బద్వేలు ఉప ఎన్నిక తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చేశారట. ఇక బీజేపీతో కలిసి ఉండడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ నిర్ణయం కూడా తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. 
 
అయితే పవన్ కళ్యాణ్‌తో విడిపోవడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదట. జనసేనానితో కలిసి ఉంటేనే అన్ని విధాలుగా మంచిదన్న అభిప్రాయంతో బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతారో.. లేకుంటే అనుకున్న విధంగానే బీజేపీతో కటిఫ్ అవుతారో..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు