బీజేపీ మునిగిపోయే పడవ... ఆ పార్టీలో కేశినేని నాని చేరడం లేదు...

మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:32 IST)
విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాన్ని తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితులు ఖండించారు. ఈ ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టంచేశారు. 
 
నాని తెదేపాని విడిచిపెట్టి భాజపాలో చేరబోతున్నారని, అందుకే తన కార్యాలయం ‘కేశినేని భవన్‌’లోని తెదేపా అధినేత చంద్రబాబు ఫొటోతో పాటు, పార్టీ నాయకుల ఫొటోలన్నీ తొలగించారని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
 
దీనిపై విస్తృతంగా ప్రచారం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన సన్నిహితుడు, తెదేపా నేత ఫతావుల్లా ఖండించారు. ఇదే అంశంపై ఫతావుల్లా సోమవారం కేశినేని భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 
 
'కేశినేని భవన్‌లో ఒక చోటమాత్రమే రతన్‌టాటాతో నాని ఉన్న చిత్రపటాన్ని పెట్టారు.  టాటా ట్రస్ట్‌ ద్వారా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రతన్‌టాటా విస్తృతంగా సేవలందించారు. దానికి కృతజ్ఞతగా, ఆ సేవల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతోను ఆ చిత్ర పటాన్ని కార్యాలయంలో ఉంచారు. అంతే తప్ప పార్టీ మారడం కోసం కాదు. అలాంటి ప్రచారం చేస్తున్న వారికి... కార్యాలయం బయట ఉన్న 40 అడుగుల ఎత్తైన చంద్రబాబు, ఎన్టీఆర్‌ చిత్రాలు కనిపించడం లేదా?' అని ఆయన ప్రశ్నించారు. 
 
విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పార్టీ ఇన్‌ఛార్జులుగా ఉన్న నాయకుల ఫొటోలు తొలగించారన్న ప్రచారం కూడా వాస్తవం కాదన్నారు. 'భాజపా మునిగిపోయే పడవ. ఆ పార్టీతో మా నాయకుడు ఎలాంటి చర్చలూ జరపడం లేదు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమనే ఉద్దేశంతోనే ఎంపీ నాని పని చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా దూరంగా లేరు. ఇటీవల తిరువూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024లో సైకిల్‌ గుర్తుపైనే పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు