150 ఏళ్ల క్రితం అనుభవాన్ని దేశంపై రుద్దాలని ప్రధాని మోదీ ఎందుకు అనుకుంటున్నారు?

సోమవారం, 24 ఏప్రియల్ 2017 (16:38 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు అనేక సంస్కరణలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. 150 ఏళ్ల క్రితం భారతదేశం అనుభవం చూసిన పాతకాలపు వ్యవహారాన్ని మరోసారి నరేంద్ర మోదీ తెరపైకి తీసుకువస్తున్నారు. అదేంటయా అంటే... ఆర్థిక సంవత్సర కాలాన్ని ఏప్రిల్ నుంచి మార్చి నెల వరకూ కాకుండా జనవరి నుంచి డిసెంబరు వరకు మార్చడం. 
 
1867కు ముందు వరకూ భారతదేశంలో జనవరి నుంచి డిసెంబరు వరకే ఆర్థిక సంవత్సరంగా వుండేది. కానీ బ్రిటీష్ పాలకులు 1867లో మన దేశ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నెల నుంచి మార్చిగా మార్పు చేశారు. ఇక అప్పట్నుంచి దాన్నే అనుసరిస్తూ వస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ ఈ పద్ధతికి స్వస్తి చెప్పి జనవరి-డిసెంబరు ఆర్థిక సంవత్సరాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనివల్ల మన దేశానికి కలిగే లాభాలేమిటి అని చూస్తే... 
 
రైతులకు మేలు జరుగుతుంది. జిడీపిలో 15 శాతానికి పైగా వ్యవసాయానిదే వాటా. సుమారు దేశంలోని మొత్తం జనాభాలో 60 శాతం మంది ఆధారపడేది వ్యవసాయం పైనే. కాబట్టి జనవరిలో బడ్జెట్ ప్రవేశపెడితే, అంతకుముందు ఏడాడిలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు... తదితర ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేసే వీలుంటుంది. తద్వారా రైతులకు మేలు కలుగుతుంది. 
 
ఇంకా వాతావరణ పరిస్థితులను కరవుతో బాధింపబడుతున్న రాష్ట్రాలకు సాయం అందించే వీలుంటుంది. అలా కాకుండా ఏప్రిల్ నుంచి మార్చి వరకూ అనేసరికి పరిస్థితులను అంచనా వేయలేని పరిస్థితి వుంటుంది. ఐతే ఆర్థిక సంవత్సరాన్ని ఇలా మార్పు చేయడానికి ఎంతో కసరత్తు, ఎన్నో మార్పులు చేయాల్సి వుంటుంది. అవన్నీ చేసేందుకు ఏమేమి చేయాలన్న దానిపై నరేంద్ర మోదీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే అన్నదాతకు పూర్తి న్యాయం చేసే అవకాశముంటుందని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం.

వెబ్దునియా పై చదవండి