టీడీపీని ముంచేస్తోంది ఎన్టీఆర్ కుమార్తేనట!

శుక్రవారం, 28 జూన్ 2019 (18:46 IST)
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. అంతేకాకుండా కేవలం 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడం కారణంగా రాష్ట్ర సమస్యలపై పోరాడేందుకు తమ సంఖ్యా బలం సరిపోదని టీడీపీ కేడర్ భావిస్తోంది. తాజాగా బాలయ్య బాబు కూడా ఇదే సెలవిచ్చారు. 
 
తమ పార్టీ అధికారం కోల్పోయి.. పూర్తిగా తుడుచుకుపెట్టిపోయే పరిస్థితుల్లో ఉందని బాలయ్య తెగ ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో బాలయ్య బాబు సొంత అక్కగారైన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బాలయ్యను ఇంకా ఫీల్ అయ్యేలా చేశారు. 
 
ఆ విషయం ఏమిటో తెలుసా? అసలే ఓడిపోయి ఉన్న టీడీపీ కేడర్‌ను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తూ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. ఈ ప్రక్రియలో బీజేపీ య‌మ స్పీడుగా దూసుకుపోతోంది. బీజేపీ అగ్ర నేత‌ల ఎత్తులకు ఇతర పార్టీ నేత‌లంతా పార్టీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు.
 
ఈ క్రమంలోనే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో కలిసిపోయారు. ఆ వెంటనే మరో టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌రో టీడీపీ నేత‌ కూడా బీజేపీలోకి దూకేస్తున్నట్లు తెలిసింది. బాలయ్య బాబుకు అత్యంత సన్నిహితుడైన పొట్లూరి కృష్ణ‌బాబు ప్రత్యుర్థులతో కలవబోతున్నాడు. లేదు లేదు ఆయనను పురందేశ్వరీనే దగ్గరుండి మరీ కలిపేస్తోంది.
 
ఆ విషయానికొస్తే, ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసలను దగ్గరుండి చేయించడానికి ప్లాన్ చేసిన వ్యక్తుల్లో ఆమె పాత్ర కూడా ఎంతైనా ఉందని అంటున్నారు. కాగా పురందేశ్వరి మరికొంత మంది టీడీపీ నాయకులను బీజేపీలో కలిపేందుకు తన వంతుగా బాగానే కృషి చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కూల్చేస్తోంది ఎన్టీఆర్ కుమార్తె కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు