రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ మాత్రం వద్దనే వద్దు.. గెహ్లాట్ ఎమ్మెల్యేల పట్టు

సోమవారం, 26 సెప్టెంబరు 2022 (11:13 IST)
Rajasthan Congress
రాజస్థాన్ రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్​ను ఎంపిక చేయకూడదంటూ సీఎం అశోక్ గెహ్లాట్ మద్దతుదారులు మొండిపట్టు పట్టారు. ఈ క్రమంలోనే 76 మంది ఎమ్మెల్యేలు స్పీకర్​కు రాజీనామా పత్రాన్ని అందించారు. ముందుగా మంత్రి శాంతి ధరివాల్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. సుదీర్ఘ చర్చల అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే, ఇప్పటివరకు ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
కాగా, ఆదివారం 90 మంది ఎమ్మెల్యేలు స్పీకర్​ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి 76 మందే రాజీనామా చేశారు. సచిన్ పైలట్​ను సీఎంగా నియమిస్తే తాము ఆమోదించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. 
 
2020లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆయన ప్రయత్నించారని.. అటువంటి వ్యక్తికి అధికారం అప్పజెప్పకూడదని వారు తేల్చి చెప్పారు. 
 
రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 
 
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అధిష్టానం చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో ముందుండి నడిపించిన ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
 
 
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్​లను అధిష్టానం రంగంలోకి దించింది. అయితే, బుజ్జగింపు ప్రయత్నాలేవీ ఫలించినట్టు కనిపించడం లేదు. ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎల్పీ భేటీ జరగాల్సి ఉండగా.. గెహ్లాట్ మద్దతుదారులెవరూ సమావేశానికి రాలేదని సమాచారం. 
 
పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలు భేటీకి  వచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఈ సమావేశాన్ని పార్టీ అధిష్టానం రద్దు చేసింది. 
 
సీఎల్పీ భేటీ కాకుండా గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా కలిసేందుకూ ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి ప్రయత్నించారు. 
 
మంత్రులు శాంతి ధరివాల్, ప్రతాప్ సింగ్ ఖచారియావాస్, మహేశ్ జోషి, ముఖ్యమంత్రి సలహాదారుడు సన్యం లోధాతో భేటీ అయ్యారు. అయినప్పటికీ రాజీనామాపై సందిగ్ధం వీడలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు