శ్రీకాళహస్తి ఆలయ కాటేజీలు ప్రైవేటు పరం... అద్దెల బాదుడు తప్పదా?

శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:12 IST)
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా అన్ని ప్రముఖ ఆలయాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారకా తిరుమల తదితర ఆలయాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిథి గృహాలను, కాటేజీల్లో ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే పేరుతో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా మన జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల కాటేజీలు, అతిథి గృహాలు ప్రైవేటుపరం కానున్నాయి.
 
శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల కోసం త్రినేత్ర గెస్ట్ హౌస్‌ 28 గదులు, జ్ఞాన ప్రసూనాంబ సదన్‌ 32 గదులు, భరద్వాజ సదన్‌ 36 గదులు, ప్రసన్న వరదరాజస్వామి గెస్ట్ హౌస్‌ 12 గదులు, భక్తకన్నప్ప సదన్‌లో 35 గదులు ఉన్నాయి. ఇందులో ఏసి, నాన్‌ ఎసి గదులు ఉన్నాయి. అద్దె కూడా అందుబాటులోనే ఉన్నాయి. నాన్‌ ఏసి గది వంద రూపాయలకు దొరుకుతుండగా ఏసి గది 400 రూపాయలకు లభిస్తోంది. 
 
కాణిపాకంలోనూ ఆలయ ఆధ్వర్యంలో గదులు ఉన్నాయి. ప్రస్తుతం గదుల కేటాయింపు ఆలయ ఉద్యోగులే పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు ఆలయాల్లోనూ కాటేజీలు, గెస్ట్ హౌస్‌లలో పారిశుధ్యం ఇతర మెయింటెనెన్స్ బాధ్యతలను ప్రైవేటు కంపెనీకి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద ఆలయాల్లో పద్మావతి హౌస్‌ కీపింగ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్ సంస్థ చూస్తోంది.
 
అయితే ఇప్పుడు గదుల కేటాయింపు వ్యవహారాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆలయాల ఆధ్వర్యంలో కాటేజీల నిర్వహణ సరిగా ఉండటం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై అప్పుడే విమర్సలు వినిపిస్తున్నాయి. ఆలయాల నిర్వహణలోని కాటేజీలు, విశ్రాంతి గదులు బాగానే ఉన్నాయని అలాంటప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తిలో దేవస్థానం కాటేజీలు, గదులు యాత్రికుల అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో ఆలయం చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రైవేటు లాడ్జీలు, హోటల్లు వెలిశాయి. ఇవి బాగానే జరుగుతున్నాయి. అవసరమైతే లాడ్జీలు నిర్మించడానికి ముందుకొచ్చేవారికి ప్రోత్సాహాలు ఇవ్వచ్చుగానీ ఆలయం ఆధీనంలో కాటేజీలు, గదులు వారికి ఇవ్వాల్సిన అవసరమేముందని అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు విశ్రాంతి గదులను వ్యాపార దృష్టితో చూస్తారని దీని వల్ల తరచూ గదుల అద్దె పెరిగే ప్రమాదముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రైవేటు వ్యక్తులకు ఏ షరతులపై ఇస్తారు. అద్దెలు ఎలా ఉంటాయి. విధి విధానాలు ఏమిటి. అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆలయాల కాటేజీలను, గదులను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయిలో అప్పుడే పైరవీలు మొదలు పెట్టినట్టు సమాచారం. అయితే ఏ దేవాలయానికి ఆ దేవాలయం విడివిడిగా కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల కాటేజీలను కలిపి ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. దీని వల్ల భక్తులు ఏ ఆలయానికి వెళ్ళినా గదుల కేటాయింపు సులభవంతమవుతుంది. ప్యాకేజీలాగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి