ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న శశికళ.. జయలలిత అనారోగ్యమే కారణం!

సోమవారం, 10 అక్టోబరు 2016 (11:20 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జయలలిత అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆమె గట్టిగా భావిస్తున్నారు. 
 
జయలలిత వ్యక్తిగత జీవితంలో శశికళది అత్యంత కీలకమైన పాత్ర. ఆమె రాజకీయంగా మంచి పలుకుబడితోపాటు సామాజికంగా బలమైన దేవర్ కులానికి చెందిన ఆమెకు వారి మద్దతు పుష్కలంగా ఉంది. అలాగే, మంత్రి పన్నీర్ సెల్వం కూడా ఇదే కులానికి చెందిన వారు. జయలలిత, శశికళకు ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు. 
 
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన శశికళ ఆశ నెరవేరలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మలచుకుని రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆమె భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 
 
ఈ నేపథ్యంలో నగదు పంపిణీ జరిగిందనే ఆరోపణలతో ఎన్నికలు వాయిదా పడిన కరూరు జిల్లాలోని అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాలతోపాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ మృతి చెందడంతో ఖాళీ అయిన మదురై జిల్లాలోని తిరుపరగుడ్రం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 
 
జయలలిత తర్వాత పార్టీలో అభ్యర్థులపై నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క శశికళకే ఉంది. దీంతో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తాను బరిలోకి దిగడమో, లేదంటే తనవారిని దింపడమో చేసి పట్టుసాధించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి